మూగజీవులపై ఆగని అమానుష ఘటనలు...ఆవు నోట్లో పేలిన నాటు బాంబు!!!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 02:19 PM

మూగజీవులపై ఆగని అమానుష ఘటనలు...ఆవు నోట్లో పేలిన నాటు బాంబు!!!

గత కొన్ని రోజులుగా మూగజీవాలపై అమానుష ఘటనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆవులు, ఏనుగులు, కోతులు, శునకాల ఇలా అనేక రకాల జంతువులపై కొందరు తమ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. జంతువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళలో గర్భిణి ఏనుగు నోట్లో పైనాపిల్‌తో కలిపి పేలుడు పదార్థులు తినిపించిన ఘటన మరవక ముందే ఏపీలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు వల్ల ఆవు తీవ్రంగా గాయపడింది.
చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం కొగిలేరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేత కోసం వెళ్లిన ఆవు నాటుబాంబుతో పెట్టిన పండును కొరకడంతో బాంబు పేలింది. ఆవు నోటి భాగం చిద్రం కాగా విషయం తెలిసిన స్థానికులు వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించారు. వైద్యుడు సకాలంలో చేరుకుని ఆవుకు తగిన చికిత్స చేశారు. పశువులు మేత మేసేందుకు వెళ్లే చోట నాటు బాంబులు పెట్టడం ఏంటని జంతు ప్రేమికుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో అమ్మ‌పాలెంకు చెందిన ఓ గ్రామ‌స్తుడు.. మూగ‌జీవం ప‌ట్ల‌ అత్యంత దారుణానికి తెగ‌బ‌డ్డాడు. నీళ్లు తాగేందుకు ఊళ్లోకి వ‌చ్చిన కోతిని ప‌ట్టుకొని చెట్టుకు ఉరి వేసి చంపేసి.. త‌న క్రూర‌త్వానికి చాటుకున్నాడు.





Untitled Document
Advertisements