కరోనాతో మాజీ క్రికెటర్ మృతి...

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 03:29 PM

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి...

కరోనా వైరస్ కారణంగా ఢిల్లీ జట్టు మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ దోబల్ (52) సోమవారం మృతి చెందాడు. ఎయిర్ ఇండియా టీమ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్.. గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అతని ఒకప్పటి సహచర బ్యాట్స్‌మెన్ మిథిన్ మాన్హాస్ వెల్లడించాడు. దాంతో.. అతడికి ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించినట్లు చెప్పుకొచ్చిన మిథిన్ మాన్హాస్.. ఆ క్రమంలో సంజయ్ కరోనా వైరస్ బారినపడినట్లు వెల్లడించాడు. సంజయ్ దోబల్‌కి భార్య, ఇద్దరు కొడుకులు ఉండగా.. ఇద్దరూ రంజీల్లో ఆడుతున్నారు.
‘‘సంజయ్‌లో ఆదివారం కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దాంతో.. నిన్న సాయంత్రం అత్యవసరంగా ప్లాస్మా ట్రీట్‌మెంట్ కూడా చేయించాం. కానీ.. ఈరోజు ఉదయం అతను తుది శ్వాస విడిచాడు. సంజయ్ బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి.. ఆ తర్వాత ఎయిర్ ఇండియాకి మంచి కోచ్‌గా ఎదిగాడు. వాస్తవానికి ఫిట్‌నెస్‌పై అతను ఎక్కువ శ్రద్ధ కనబర్చేవాడు. కుర్రాళ్లకి కూడా ఫస్ట్ క్రికెట్ కంటే.. ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా పాఠాలు చెప్పేవాడు’’ అని మిథిన్ మాన్హాస్ వెల్లడించాడు.

ఢిల్లీ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణించిన సంజయ్.. ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్నర్‌గా జట్టుకి విజయాల్ని అందించినట్లు అతని సహచరులు గుర్తు చేసుకున్నారు. యువ క్రికెటర్లకి సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే అతను.. అందరితోనూ సరదాగా మెలిగినట్లు అతని చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా వెల్లడించాడు.





Untitled Document
Advertisements