పాక్ స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రదాడి...పది మంది మృతి!!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 03:54 PM

పాక్ స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రదాడి...పది మంది మృతి!!

పాకిస్థాన్‌లో స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ భవనం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు మృతిచెందారు. ఈ భవనంపై నలుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీచేయించారు. దాడిలో పలువురికి గాయాలైనట్టు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో పది మంది మృతిచెందగా.. వీరిలో నలుగురు ఉగ్రవాదులేనని పేర్కొంది.
స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ప్రవేశించిన ముష్కరులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు, పాక్ సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించి ముష్కరులను కాల్చి చంపింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకున్న సైన్యం... మరో ఉగ్రవాది దాక్కుని ఉంటాడని అనుమానిస్తోంది. ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు.. ఉగ్రవాదులు మెయిన్ గేట్ నుంచి భవనంలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
భద్రత దళాల కళ్లుగప్పి సైనిక దుస్తుల్లో ముష్కరులు లోనికి ప్రవేశించారు. తర్వాత గ్రనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఘాతకాన్ని సింధ్ ప్రావిన్సుల గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ తీవ్రంగా ఖండించారు. ‘ఉగ్రవాదంపై తాము చేస్తున్న యుద్ధాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పీఎస్‌ఎక్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేరస్థులు సజీవంగా పట్టుబడ్డారని, వారికి కఠినమైన శిక్షలు విధించేలా చూడాలని భద్రత దళాలకు సూచించారు. మేము సింధ్‌ను అన్ని విధాలుగా రక్షించుకుంటాం’ అని అన్నారు.

ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేట్ సంస్థల కార్యాలయాలు, సంపన్నుల నివాసాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి.






Untitled Document
Advertisements