బార్డర్ లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు...ఘాతక్ కమాండోలను దింపిన భారత్!!!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:46 PM

బార్డర్ లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు...ఘాతక్ కమాండోలను దింపిన భారత్!!!

గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత టిబెట్‌ నుంచి దాదాపు 20 మంది మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులను సరిహద్దులకు తరలించి తమ బలగాలకు చైనా శిక్షణ ఇప్పిస్తున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ సైతం మరింత అప్రమత్తమయ్యింది. తమ బలగాల రక్షణ కోసం చైనా సరిహద్దుల్లో ఘాతక్‌ బృందాలను మోహరిస్తోంది. ఇటీవల గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో ఈ కమాండోలే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని హడలెత్తించిన సంగతి తెలిసిందే.
ఘాతక్‌ కమాండోల శిక్షణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కర్ణాటకలోని బెల్గాంలో దాదాపు 43 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా నిత్యం 35 కిలోల బరువు వీపుపై వేసుకొని 40 కిలోమీటర్ల మేరకు పరుగెత్తుతారు. దీంతో వీరు త్వరగా అలసిపోరు. ఆయుధ శిక్షణకు తోడు కేవలం చేత్తో శత్రువును మట్టు పెట్టేందుకు అవసరమైన టెక్నిక్‌లను నేర్పిస్తారు. అంతేకాదు, రైఫిల్స్‌తోపాటు 20 కిలోల బరువును భుజాలపై 20 నుంచి 60 కిలోమీటర్ల దూరం అవలీలగా తీసుకెళ్లే సామర్థ్యం వీరికి ఉంటుంది.
ఘాతక్ కమాండోలు శత్రువుల వైమానిక స్థావరాలు, ఆయుధ డిపోలు, ప్రధాన కార్యాలయాలపై ప్రత్యక్ష దాడులు చేయగలరు. శత్రు శ్రేణుల వెనుక ఉన్నప్పుడు ఫిరంగులు, వైమానిక దాడులను కూడా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం, కొండలను ఎక్కడం, కూల్చివేతలు, రవాణాలోనూ శిక్షణ ఇస్తారు.

ప్రతి యూనిట్‌లో ఒక జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌తో కలిపి 22 మంది ఘాతక్‌లు ఉంటారు. వీరికి మరో బృందం బ్యాకప్‌గా ఉంటుంది. అంటే ప్రతి యూనిట్‌లో దాదాపు 45 మంది వరకు కమాండోలు ఉంటారు. ప్రతి ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌ ఏటా ప్రత్యేక శిక్షణకు వెళతాడు. దీంతో పాటు ప్రతి యూనిట్‌లో 40 మంది వరకు జవాన్లను కూడా ప్రత్యేక శిక్షణకు పంపిస్తారు. వీరు శిక్షణ ముగించుకొని వచ్చాక మరో కమాండో బృందంలో చేరతారు.



అప్పటికే కమాండో బృందం ఉండి బయటకు వచ్చిన వారు కూడా అదే యూనిట్‌లో కొనసాగుతారు. ఈ లెక్కన ప్రతి యూనిట్‌లో దాదాపు 50శాతం జవాన్లు ఘాతక్‌ శిక్షణ పూర్తి చేసుకుంటారు. భారత్‌-చైనాలకు 1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించడంపై నిషేధం ఉంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ సమయంలో ఘాతక్ కమాండోల పాల్గొంటారు. ఇక, 1999 నాటి కార్గిల్ యుద్ధంలో ఘాతక్ కమాండో యోగేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆ యుద్దంలో ఆయన శౌర్య పరాక్రమాలకు మెచ్చి పరమ్ వీర్ చక్ర అవార్డును బహుకరించారు. 2011లో గుర్యేజ్ సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన లెఫ్టినెంట్ జనరల్ నవదీప్ సింగ్ కూడా ఘాతక్ కమాండోయే. తర్వాత ఆయన సాహసానికి అశోక్ చక్ర అవార్డు దక్కింది.





Untitled Document
Advertisements