"నేను నిలకడగా రాణించి ఉంటే..నా స్థానంలోకి ఎవరూ వచ్చే వారు కాదు"

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 11:05 AM


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కారణంగానే తన కెరీర్ తొందరగా ముగిసిపోయిందనే వాదనని అంగీకరించబోనని భారత వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ స్పష్టం చేశాడు. ధోనీ కంటే ముందే భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పార్థీవ్ పటేల్.. రెండేళ్ల వ్యవధిలోనే ధోనీకి తన స్థానాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ధోనీ కెప్టెన్‌గా మారడంతో.. టీమిండియా కీపర్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఒక్క పార్థీవ్ పటేల్ మాత్రమే కాదు.. ధోనీ శకంలో దినేశ్ కార్తీర్, రాబిన్ ఊతప్ప, సాహా తదితర వికెట్ కీపర్లు కొన్నేళ్లపాటు కనుమరుగైపోయారు.
భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పార్థీవ్ పటేల్.. తన కెరీర్ ఇలా గాడి తప్పడానికి కారణం స్వయంకృపరాధమేనని అంగీకరించాడు. అప్పట్లో తాను బాగా ఆడింటే..? టీమిండియా మేనేజ్‌మెంట్ తనకే అవకాశాలిచ్చేదని చెప్పుకొచ్చిన పార్థీవ్.. తాను ఫెయిలవడంతోనే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించి ధోనీకి అవకాశమిచ్చిందని గుర్తు చేసుకున్నాడు. కెరీర్‌లో 25 టెస్టులు, 38 వన్డేలాడిన పార్థీవ్ పటేల్ కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేకపోయాడు.

‘‘చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు.. ధోనీ శకంలో పుట్టడమే నా తప్పు అని. కానీ.. ధోనీ కారణంగా నా కెరీర్ తొందరగా ముగిసిపోయిందని చెప్పి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటంటే..? నా ప్రదర్శన అప్పట్లో బాగాలేదు. కాబట్టే.. వేరొకరికి నా స్థానంలో కీపర్‌గా అవకాశం దక్కింది. వాస్తవానికి ధోనీ కంటే ముందు నా స్థానంలో దినేశ్ కార్తీక్‌కి ఛాన్స్ లభించింది. ఆ తర్వాతే ధోనీ వచ్చాడు. ఒకవేళ నేను నిలకడగా రాణించి ఉంటే..? ఎవరూ నా స్థానంలోకి వచ్చే వారు కాదు. ధోనీ శకంలో పుట్టి.. ఎక్కువ రోజులు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడంపై ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు’’ అని 35 ఏళ్ల పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.





Untitled Document
Advertisements