ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 18,800 కరోనా పాజిటివ్ కేసులు...

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 11:16 AM

ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 18,800 కరోనా పాజిటివ్ కేసులు...

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. అయితే, వరుసగా రెండో రోజు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 18,870 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ, కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దేశవ్యాప్తంగా మరో 421 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 567,300కి చేరగా.. మరణాలు 16,900కి చేరాయి. కరోనా నుంచి 3.35 లక్షల మంది కోలుకోగా.. 2.15 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 5,257కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 169,883కి చేరాయి. కేవలం జూన్ నెలలోనే 1.02 లక్షల కేసులు ఆ రాష్ట్రంలో బయటపడ్డాయి. ఇప్పటి వరకూ 7,610 మరణాలు చోటుచేసుకోగా.. ముంబయి నగరంలోనే అత్యధికంగా 4,462 మంది ఉన్నారు.

కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 6,985 కేసులు నమోదుకాగా.. దేశం మొత్తం కేసుల్లో ఇవి 37 శాతం. ఆదివారం దేశంలో 19,741 కేసులు బయటపడగా.. ఈ ఐదు రాష్ట్రాల్లో 7,150 (36.2 శాతం) కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో వరుసగా ఏడో రోజు పాజిటివ్ కేసులు 3వేలకుపైగా నమోదుకాగా.. సోమవారం 3,949 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

ఏపీలో కొత్తగా 793 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు సంభవించాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకూ 30,216 నమూనాల్ని పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసుల్లో 706 రాష్ట్రానికి చెందినవి కాగా.. విదేశాలు, పొరుగు రాష్ట్రాల కేసులు 6, 81 చొప్పున ఉన్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటిదాకా 13,891 మందికి వైరస్‌ సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది.


తెలంగాణలో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం (జూన్ 29) రాష్ట్రంలో కొత్తగా 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి రాష్ట్రంలో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కు చేరుకోగా.. మరణాల సంఖ్య 253కు ఎగబాకింది.





Untitled Document
Advertisements