హైదరాబాద్ లో ఫ్రీగా కరోనా టెస్టులు..ఎక్కడెక్కడంటే?

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 03:18 PM

హైదరాబాద్ లో ఫ్రీగా కరోనా టెస్టులు..ఎక్కడెక్కడంటే?

హైదరాబాద్‌ పరిధిలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేయడం మళ్లీ ప్రారంభించారు. మెహెదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌‌లోని నిజామియా హాస్పిటల్‌లో మంగళవారం నుంచి కరోనా పరీక్షల కోసం అనుమానితుల నుంచి శాపిళ్లను సేకరిస్తున్నారు. అయితే, ఒక్కో కేంద్రంలో రోజుకు కనీసం 250 నమూనాలు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అంతేకాక, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, బాలాపూర్‌ యూపీహెచ్‌సీ, మహేశ్వరం సీహెచ్‌సీలలో రోజుకు కనీసం 150 శాంపిల్స్‌ చొప్పున సేకరించి పరీక్షించాలని నిర్ణయించారు.
గత 10 రోజుల నుంచి తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచిన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య బాగా పెరుగుతుండడంతో 50 వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా ఈనెల 16 నుంచి 9 రోజుల పాటు దాదాపు 36 వేల నమూనాలు సేకరించారు. కానీ, కరోనా పరీక్ష చేసే ల్యాబ్‌లు రోజంతా పని చేసినా, సేకరించిన అన్ని నమూనాలను పరీక్షించలేని స్థితి ఏర్పడింది. దీంతో శాంపిళ్ల సేకరణను రెండ్రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న శాంపిల్ పరీక్షలు పూర్తికావడంతో మళ్లీ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.





Untitled Document
Advertisements