దేశప్రజలకు ప్రధాని మోదీ ‘దీపావళి’ శుభవార్త

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 05:01 PM

దేశప్రజలకు ప్రధాని మోదీ ‘దీపావళి’ శుభవార్త

కరోనా క్లిష్ట సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశవాసులకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మరో 5 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా దేశంలోని 80 కోట్ల మంది లబ్ధి పొందనున్నట్లు వివరించారు. గడిచిన మూడు నెలలతో కలిపి ఈ పథకానికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి, ఓనం, దసరా, నవరాత్రులు, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. రానున్న కాలంలో పలు పండగలు వస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని.. పండగ వేళ ప్రజలకు ఇబ్బంది పడకుండా నవంబర్ నెల చివరి వరకూ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రానున్న 5 నెలల పాటు 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు.

కరోనాతో పోరాడుతూనే..
కరోనాతో పోరాడుతూనే 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించామని ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని దేశాల జనాభాకు పదింతల కంటే పైగా మందికి లబ్ధి చేకూర్చామని.. ప్రపంచమే ఆశ్చర్యపోతోందని మోదీ వివరించారు. గడిచిన 3 నెలల్లో 20 కోట్ల మంది పేదల ఖాతాల్లో రూ.31 కోట్లు డబ్బు జమ చేసినట్లు గుర్తు చేశారు. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసినట్లు గుర్తు చేశారు.

దీపావళి పండగ వరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయడానికి రూ. 90 వేల కోట్లు ఖర్చవుతాయని మోదీ తెలిపారు. ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 60 వేల కోట్లకు ఇది అదనమని వివరించారు. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ తెలిపారు. ఇందు కోసం రూ.50 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రాకుండా చూస్తున్నట్లు వివరించారు. పండగలతో అవసరాలు, ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్న మోదీ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.





Untitled Document
Advertisements