‘నా చావుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కారణం’...వ్యక్తి ఆత్మహత్య!!!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 07:47 PM

హన్మకొండలో ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాక, అతను తన చావుకు కారణం స్థానిక ఎమ్మెల్యే అని సూసైడ్ నోట్ రాయడం మరింత దుమారం సృష్టిస్తోంది. స్థానిక అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఈ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడిపోయాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అతనికి తక్షణం చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని బ్యాగును పరిశీలించగా ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని వెంకటేశ్వర్లు అందులో రాశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.

ఈ క్రమంలో ఇతని ఆత్మహత్యాయత్నానికి, ఎమ్మెల్యేకు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమరవీరుల స్థూపం ముందు ఎందుకు ఆత్మాహత్యాయత్నం చేసుకున్నాడు? ఎమ్మెల్యే పాత్ర ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.





Untitled Document
Advertisements