జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాలను రాత్రి 9.30 గంటల్లోగా మూసేయాల్సి ఉంటుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. హైదరాబాదు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
మంగళవారం నాటికి తెలంగాణలో 16,339 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 260 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెలంగాణలో 945 కొత్త కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.