మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు..నేటి నుంచే కొత్త ధరలు

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:43 PM

మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు..నేటి నుంచే కొత్త ధరలు

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ఝలక్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పైపైకి చేరాయి. అయితే ధర పెరుగుదల స్వల్పంగానే ఉందని చెప్పుకోవచ్చు.

ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.4.5 వరకు పెరిగింది. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 14.2 కేజీల సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది. తాజా రేట్లు ఈ రోజు నుంచే అంటే జూలై 1 నుంచే అమలులోకి వస్తాయి. కాగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం.

తాజా రేట్ల పెంపు నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.1 మాత్రమే పెరిగింది. దీంతో ధర రూ.594కు చేరింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.4.5 పెరిగింది. దీంతో ధర రూ.620కు ఎగసింది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పైకి చేరింది. దీంతో ధర రూ.594కు ఎగసింది. చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.610కు చేరింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.645కు ఎగసింది.

ఇకపోతే ఎల్‌పీజీ సిలిండర్ ధర జూన్ నెలలో రూ.11.5 మేర పెరిగిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మార్చి నుంచి మే వరకు చూస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.277 మేర తగ్గింది. కాగా పెట్రోల్ ధరలు ప్రతి రోజూ మారుతున్నట్లు గానే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ్ ధర ప్రతి నెలా ఆరంభంలోనే మారుతూ వస్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను (14.2 కేజీలు) ప్రజలకు సబ్సిడీ కింద అందిస్తున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements