చైనాలో మరో కొత్త రకం వైరస్...!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 03:20 PM

చైనాలో మరో కొత్త రకం వైరస్...!

చైనాలో కొత్తరకం ఫ్లూ వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానికి మహమ్మారిగా మారగల సామర్థ్యం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ జాతి వైరస్ పందుల్లో వస్తుంది. కానీ అది మనుషులకు కూడా సైలెంట్‌గా వ్యాపించవచ్చని పేర్కొన్నారు. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకోగలదని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని, మహమ్మారిగా కూడా మారవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



పందుల నుంచి మనుషులకు వ్యాపించడానికి అవసరమైన అన్ని లక్షణాలూ ఈ వైరస్‌కు ఉన్నాయని, అందుకే, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉందని శాస్త్రవేత్తలు నొక్కివక్కాణించారు. ‘ఇది కొత్తరకం ఫ్లూ వైరస్ కాబట్టి, దీన్నుంచి కాపాడుకునే రోగనిరోధక శక్తి ప్రజల్లో తక్కువగా ఉంటుంది, లేదంటే అసలు ఉండకపోవచ్చు’ అని వారు చెబుతున్నారు. సీజనల్‌గా వ్యాప్తి చెందే హెచ్1ఎన్1 రకం వైరస్ 2009లో ప్రపంచవ్యాప్తంగా విజృంభించి 285,000 మందిని పొట్టనబెట్టుకుంది.

వాస్తవానికి ప్రస్తుతం వెలుగు చూసిన ఈ జీ4 వైరస్ పాతదే. దీనిని చైనా పరిశోధకులే తొలుత గుర్తించారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్, షాండాంగ్ అగ్రిక‌ల్చ‌రల్ యూనివర్సిటీ, చైనీస్ నేషనల్ ఇన్ ఫ్లుయెంజా సెంటర్ సంయుక్తంగా 2011 నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి.

అప్పటి నుంచి 2018 వరకు చైనాలోని 10 ప్రావిన్సులలో పందుల పెంపకం క్షేత్రాలు, వెటర్నరీ బోధన ఆస్పత్రుల నుంచి 30 వేల శాంపిళ్ల‌ను పరిశోధకులు సేకరించారు. వాటిలో 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్‌లను గుర్తించారు. వీటిలో చాలా వరకు ప్రమాదకరం కాదని నిర్దారించారు. కొన్ని రోజుల తర్వాత అవి నిర్వీర్యమవుతున్న‌ట్లు తేల్చారు. కానీ, స్వైన్ ఫ్లూ లక్షణాలున్న (హెచ్ 1ఎన్ 1) ఉన్న ఈ జీ4 వైరస్ మాత్రం ఎప్ప‌టికప్పుడు బలంగా మారుతున్న‌ట్లు గుర్తించారు. ప్ర‌త్యేకించి 2016 తర్వాత అది మరింత బలంగా మారినట్టు తేలింది. సార్స్-కోవి-2 మాదిరిగా ఈ వైరస్ మరింత మార్పులతో ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు.



ఇప్ప‌టికే చైనాలో పందుల కబేళాలలో పనిచేస్తున్నవారికి వైరస్ సోకినట్టు సోమవారం వెల్లడించిన పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. 2016 నుంచి 2018 మధ్య‌ పందులను పెంచే రైతుల్లో 10 శాతం మందికి, సాధారణ జనాభాలో 4.4 శాతం మందికి జీ4 వైరస్ సోకినట్లు యాంటీ బాడీ టెస్టుల్లో నిర్ధారించారు. ఈ కేసులు పందుల పెంపకం ఎక్కువ‌గా ఉండే హీబే, షాండోంగ్ ప్రావిన్సుల్లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిలో నిర్వహించిన పరీక్షల్లో 20.5 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్త‌ వైరస్ కాదని, పాతదేనని, ఒకవేళ ఇది సోకినా ఇప్పుడున్న ఏ వ్యాక్సిన్ పనిచేయదని పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడానికి కొద్ది రోజుల ముందే గతేడాది డిసెంబరులో ఈ పరిశోధనను సమీక్ష కోసం పంపారు.

దీనిపై నేషనల్ తైవాన్ యూనివర్సిటీ పీడియాట్రిక్స్ ఇన్‌ఫక్టియస్ డిసీజెస్ విభాగం డైరెక్టర్ లి-మిన్ హౌంగ్ మాట్లాడుతూ.. పందుల పెంపకం క్షేత్రాలలో వైరస్ బారినపడ్డ వారి నుంచి ఎవరికైనా ఇది సోకిందా? వారి కుటుంబాలకు వైరస్ వ్యాప్తి చెందిదా? అనేది గుర్తించడం తదుపరి కీలకమైన దశ అని అన్నారు. వైరస్ పందుల నుంచి మనిషికి సోకినా.. మనిషి నుంచి మనిషికి సోకిన ఆధారాలు లేవని దీనిపై గత ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్ట‌న్ బయాలజీ ప్రొఫెసర్ కార్ల్ బెర్గ్ స్టార్మ్ అన్నారు.





Untitled Document
Advertisements