ఆన్‌లైన్ క్లాసుల విషయంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 04:16 PM

ఆన్‌లైన్ క్లాసుల విషయంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

లాక్‌డౌన్ వల్ల స్కూలు విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. లాక్‌డౌన్ సమయంలోనూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గంటల తరబడి ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్‌ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకపోయినా, అడ్డగోలుగా ఫీజులు చెల్లించాలని పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని కోర్టుకు తెలిపింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను ఉల్లంఘించి పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల అసోసియేషన్ కోర్టుకు వెల్లడించింది. దీనికి ఆధారాలుగా స్కూళ్లు తల్లిదండ్రులకు పంపిన సందేశాలను, ఫోన్ కాల్ రికార్డులను ధర్మాసనం ముందుంచింది. విచారణ చేపట్టిన ధర్మాసనం ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం ఏదైనా జీవో జారీ చేసిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాస్‌లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్‌లైన్‌ క్లాసులపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.

హరియాణాలో ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిషేధించారని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. పంజాబ్‌, హరియాణాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని అక్కడి ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చాయని వెల్లడించింది. తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై యూనిఫామ్‌ పాలసీ (ప్రత్యేకమైన విధానం) తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించింది.





Untitled Document
Advertisements