"చైనా స్ఫాన్సర్‌షిప్‌‌‌కి IPL గుడ్‌ బై"

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 05:57 PM


భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సెగ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ని కూడా తాకింది. లఢక్‌లోని గాల్వన్ సరిహద్దు వద్ద ఇటీవల చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాంతో.. చైనా తీరుని నిరసిస్తూ గత సోమవారం ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ స్ఫాన్సర్స్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏం నిర్ణయం తీసుకోబోతోంది..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌గా చైనాకి చెందిన Vivo ఉంది. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుండగా.. దాన్ని వీలైనంత త్వరగా క్యాన్సిల్ చేసుకోవాలని బీసీసీఐకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ- యజమాని నెస్ వాడియా సూచించాడు. ఐపీఎల్‌తో వివోనే కాదు.. పేటీఎం, స్విగీ, డ్రీమ్ ఎలెవన్ తదితర కంపెనీలు కూడా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాయి. దాంతో.. ఇప్పటికిప్పుడు అగ్రిమెంట్‌లను రద్దు చేసుకుంటే రూ.వేల కోట్లని బీసీసీఐ నష్టపోవాల్సి ఉంటుంది.

‘‘ఐపీఎల్‌లో చైనా కంపెనీలతో ఉన్న అగ్రిమెంట్‌లను బీసీసీఐ వదులుకోవాలి. ఫస్ట్ దేశం.. తర్వాతే డబ్బు. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అంతే తప్ప చైనీస్ ప్రీమియర్ లీగ్ కాదు. కాబట్టి.. ఆ కంపెనీలతో ఒప్పందాల్ని త్యజించడం ద్వారా బీసీసీఐ అందరికీ ఆదర్శంగా నిలవాలి. నిజమే.. స్ఫాన్సర్లని వదులుకుంటే వెంటనే దొరకడం కష్టం. కానీ.. భారత్‌లోనే ఆ స్ఫాన్సర్లని భర్తీ చేయగల కంపెనీలు చాలా ఉన్నాయి. దేశాన్ని, ప్రభుత్వాన్ని.. అన్నికంటే మించి మన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల్ని మనం గౌరవించాలి’’ అని నెస్ వాడియా సూచించాడు.





Untitled Document
Advertisements