మోదీకి రేవంత్ లేఖ...కరోనా విషయంపై టీఎస్ సర్కార్ పై ఫిర్యాదు!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 08:55 PM

మోదీకి రేవంత్ లేఖ...కరోనా విషయంపై టీఎస్ సర్కార్ పై ఫిర్యాదు!

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్ కాబోతోందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా పరిస్థితి చేయి దాటుతోందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యంగా చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. అంతేకాక, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రి టిమ్స్ అలంకారప్రాయంగా ఉందని రేవంత్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి కొవిడ్ ఆసుప‌త్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్లోనూ తీవ్ర సమస్యలున్నాయని ప్రధానికి లేఖలో వివరించారు. కరోనా వ్యర్థాలు గాంధీ ఆస్పత్రిలో కుప్పలుగా ఉండిపోయాయని ఫిర్యాదు చేశారు. దీనిపై మాన‌వ హ‌క్కుల సంఘం సుమోటోగా కేసును స్వీకరించి విచారణ జరుపుతున్నట్లుగా ప్రధానికి రాసిన లేఖ‌లో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో ప్రైవేట్ కళాశాలలు ఉన్నా కరోనా పోరులో వాటిని వాడుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

‘‘దేశంలోనే అత్యధిక కేసులున్న మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్‌గా నమోదవుతున్న రేటు 22 శాతం ఉంది. అదే తెలంగాణలో 27 శాతం లెక్కన ఉంది. తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇప్పటిదాకా కేవలం 70 వేల టెస్టులు మాత్రమే చేశారు. ఇదే సమయంలో ఏపీలో 6 లక్షలకు పైగా టెస్టులు చేశారు. ఏపీలో 42 ట్రూనాట్ కిట్లు ఉంటే తెలంగాణలో 22 మాత్రమే ఉన్నాయి. ఫలితాలు సైతం ఆలస్యంగా వస్తున్నాయి. ఈలోపు వ్యాధి ముదిరి చాలా మంది మరణిస్తున్నారు.’’ అని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.





Untitled Document
Advertisements