ప్రజలకు ఊరట: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లపై కేంద్రం నిర్ణయం

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 12:18 PM

ప్రజలకు ఊరట:  స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లపై కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు శుభవార్త అందించింది. అలాగే ఉద్యోగులకు కూడా తీపికబురు తీసుకువచ్చింది. వీరందరికీ ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు (స్మాల్ సేవింగ్ స్కీమ్స్)పై వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది వర్తిస్తుంది.
మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. ఇటీవల వెలువడిన చాలా నివేదికలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు దిగివస్తాయని పేర్కొన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ షాకిస్తూ.. వడ్డీ రేట్లును స్థిరంగానే కొనసాగించింది.
కేంద్ర ప్రభుత్వపు తాజా నిర్ణయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)పై 7.4 శాతం వడ్డీనే కొనసాగుతుంది. అలాగే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో వడ్డీ పొందొచ్చు.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో చేరితే 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే.. ఈ స్కీమ్‌లో చేరిన వారి డబ్బు 124 నెలల్లో డబుల్ అవుతుంది. ఇకపోతే పాపులర్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజనలో చేరితే 7.6 శాతం వడ్డీ వస్తుంది. మిగతా అన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కెల్లా ఇందులోనే ఎక్కువ వడ్డీ లభిస్తోంది.



కాగా మోదీ సర్కార్ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి సంబంధించి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించేసిన విషయం తెలిసిందే. ఏకంగా 1.4 శాతం వరకు కోత విధించింది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి గతంలో కన్నా తక్కువ రాబడి వస్తోంది.





Untitled Document
Advertisements