ఐపీఎల్ స్ఫాన్సర్‌‌పై వెనక్కి తగ్గని బీసీసీఐ!!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 02:51 PM

ఐపీఎల్ స్ఫాన్సర్‌‌పై వెనక్కి తగ్గని బీసీసీఐ!!

ఐపీఎల్‌ టైటిల్ స్ఫాన్సర్‌గా ఉన్న వివోతో బంధం తెంచుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. లఢక్‌లోని గాల్వన్ సరిహద్దు వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా.. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం నుంచి నిషేధించింది. దాంతో.. చైనాకి చెందిన వివోతో ఉన్న స్ఫాన్సర్‌షిప్ బంధాన్ని తెంచుకోవాలని బీసీసీఐని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే.. గత కొద్ది రోజుల నుంచి స్ఫాన్సర్‌షిప్‌పై పునరాలోచిస్తున్నామంటూ చెప్పుకొచ్చిన బీసీసీఐ.. తాజాగా స్ఫాన్సర్‌షిప్‌ని వదులుకునే ఆలోచనలో లేదని తేల్చేసింది. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ రూపంలో ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుండగా.. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అది చైనా కంపెనీకే లాభం చేకూర్చినట్లవుతుందని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు- నవంబరులో ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

‘‘ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌పై బీసీసీఐ రివ్యూ చేస్తోంది అని మాత్రమే చెప్పాం. అంతేతప్ప క్యాన్సిల్ లేదా కొనసాగింపు అనే మాటని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే.. అప్పుడు చైనా కంపెనీ (వివో)కే ఎక్కువ లాభం చేకూరుతుంది. అయినా.. ఏటా రూ.440 కోట్ల ఆదాయం చైనా నుంచి వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి..? ఒకవేళ ఆ ఒప్పందం రద్దు బీసీసీఐకి అనుకూలంగా ఉండింటే.. అప్పుడు కచ్చితంగా రద్దు చేసుకునేవాళ్లం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.





Untitled Document
Advertisements