ఆస్ట్రేలియా బౌలర్లతో భారత ఓపెనర్ రోహిత్ శర్మకి పెద్ద సవాల్ ఎదురుకాబోతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టుల సిరీస్లో కంగారూలతో తలపడనుంది. గత పర్యటనలో ఆస్ట్రేలియాని టెస్టుల్లో 2-1 తేడాతో ఓడించిన భారత్ జట్టు ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
2019, అక్టోబరు వరకూ టెస్టుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్తో అనూహ్యంగా ఓపెనర్గా అవతారమెత్తి సంచలన ఇన్నింగ్స్లు ఆడేశాడు. మూడు టెస్టుల ఆ సిరీస్లో వరుసగా 176, 127, 212 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్గా గత ఏడాది మొత్తంగా 92.66 సగటుతో ఏకంగా 556 పరుగులు చేశాడు. దాంతో.. అదే జోరుని ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ కొనసాగించాలంటే.. ఆ దేశ బౌలింగ్ అటాక్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హస్సీ చెప్పుకొచ్చాడు.
‘‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఏ బ్యాట్స్మెన్కైనా సవాలే. కానీ.. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లోనూ అతను జోరందుకున్నాడు. కాబట్టి.. ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ అదే జోరుని కొనసాగిస్తాడని నా నమ్మకం. కానీ ఆస్ట్రేలియా పిచ్లపై.. అదీ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కోవడం రోహిత్ శర్మకి సవాలే’’ అని హస్సీ వెల్లడించాడు.