2011 వరల్డ్‌కప్ ఫిక్సింగ్: శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరకి సమన్లు జారీ

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 05:01 PM

2011 వరల్డ్‌కప్ ఫిక్సింగ్: శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరకి సమన్లు జారీ

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెట్‌ని కుదిపేస్తోంది. భారత్‌తో ముంబయిలోని వాంఖడే వేదికగా ఆ మ్యాచ్ జరగగా.. ఆ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని ఇటీవల శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందానంద సంచలన ఆరోపణలు గుప్పించాడు. దాంతో.. ఆ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్‌కి స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఈ టీమ్.. అప్పటి శ్రీలంక జట్టు చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వా, ఓపెనర్ ఉపుల్ తరంగాతో పాటు మహిందానందని కూడా విచారించి వారి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకుంది. తాజాగా.. అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరకి సమన్లు జారీ చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్.. గురువారం విచారణకి హాజరు కావాల్సిందిగా అందులో ఆదేశించింది. మహిందానంద ఫిక్సింగ్ ఆరోపణలపై తొలుత స్పందించిన సంగక్కర.. ఆధారాలుంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఆ ఫైనల్ మ్యాచ్ టాస్ వద్ద నుంచే అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్లు ధోనీ, సంగక్కర తికమక కారణంగా రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. దానికి గల కారణాన్ని కూడా ఇటీవల సంగక్కర వెల్లడించాడు. ‘‘ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ టాస్ వేయగానే నేను టెయిల్స్ కోరాను. కానీ.. అభిమానుల అరుపుల మధ్య నేను ఏం చెప్పానో ధోనీకి అర్థం కాలేదు. దాంతో.. నువ్వు టెయిల్స్ కోరావా..? అని అడిగాడు. దానికి నేను.. కాదు.. టెయిల్స్ కోరాను అని చెప్పా. అలా ఉంది మరి అప్పుడు స్టేడియంలో పరిస్థితి. మ్యాచ్ రిఫరీ మాత్రం నువ్వు టాస్ గెలిచావు అని నాతో చెప్పాడు. కానీ.. ఇద్దరి కెప్టెన్ల మధ్య టాస్ విషయంలో కన్‌ప్యూజన్‌ ఉందని రిఫరీకి వివరించిన ధోనీ.. మళ్లీ టాస్ వేద్దామని చెప్పాడు. దాంతో.. మళ్లీ టాస్ వేయగా.. నేను గెలిచాను. కానీ.. ఒకవేళ నేను టాస్ ఓడింటే శ్రీలంక ఛేదనకు దిగేది. అప్పుడు గెలిచే అవకాశం ఉండేదేమో..?’ అని సంగక్కర వెల్లడించాడు.





Untitled Document
Advertisements