ఐపీఎల్ 2020 సీజన్ భారత్ వెలుపల జరగడం దాదాపు ఖాయమైపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి భారత్లో ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాటికి భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటేసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు- నవంబరు మధ్య జరగాల్సిన టీ20 వరల్డ్కప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండగా.. ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ నిర్ణయించింది. అయితే.. అప్పటిలోపు భారత్లో కరోనా వైరస్ అదుపులోకి వస్తుందని ఆశించిన బీసీసీఐ.. దేశంలో క్రికెట్ సంఘాలకి కూడా ఐపీఎల్కి సిద్ధంగా ఉండాలంటూ లేఖలు రాసింది. కానీ.. దేశంలో పరిస్థితులు రోజు రోజుకి అధ్వానంగా మారుతుండటంతో ఇక భారత్లో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించడం అసాధ్యమని బీసీసీఐ తేల్చేసినట్లు తెలుస్తోంది.
‘‘ఈ ఏడాది ఐపీఎల్ భారత్ వెలుపలే జరుగుతుంది. కేవలం ఒక సిటీలో.. రెండు మూడు స్టేడియాల్లో అంత పెద్ద టోర్నీని నిర్వహించడం కష్టం. దానికి తోడు.. ఆటగాళ్ల భద్రత కూడా బీసీసీఐకి ముఖ్యం. అయితే.. ఏ దేశంలో టోర్నీ నిర్వహించాలో..? ఇంకా డిసైడ్ చేయలేదు. పోటీలో మాత్రం ప్రస్తుతానికి శ్రీలంక, యూఏఈలు ఉన్నాయి. కరోనా వైరస్ తక్కువగా ఉండి.. ఏ దేశం టోర్నీకి అనువుగా ఉంటే అక్కడ నిర్వహిస్తాం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు.