ఎన్నికలపై కేంద్రం సంచలన నిర్ణయం!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 08:12 PM

ఎన్నికలపై కేంద్రం సంచలన నిర్ణయం!

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ల పైబడిన వయసు వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెలుసుబాటు కల్పించింది. వీరితో పాడు కొవిడ్-19 రోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర న్యాయ శాఖ గురువారం (జులై 2) సాయంత్రం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘1961 ఎన్నికల నిబంధనల చట్టంలోని ఆర్టికల్ 27ఎ’లో ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు న్యాయశాఖ ప్రకటనలో పేర్కొన్నారు.

అక్టోబర్‌ - నవంబర్‌లో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడటం గమనార్హం. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.

65 ఏళ్ల వయసు పైబడిన వారు, షుగర్, బీపీ ఉన్న వారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు షుగర్ పేషెంట్లు, రక్తపోటుతో బాధపడుతున్న వారు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అలాంటి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఊరటనివ్వనుంది.

కొవిడ్-19 బారినపడి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 80 ఏళ్లకు పైబడిన వారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది. తాజాగా దీన్ని 80 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు కుదించారు.





Untitled Document
Advertisements