లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 11:09 AM

లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. లేహ్, లడఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. తొలుత ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. సైనికులతో సమావేశమయ్యారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో సింధు నది జన్మస్థానం వద్ద ఈ సమావేశం జరుగుతోంది. శుక్రవారం ఉదయం లడఖ్ కు మోదీ వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. మోదీ కూడా సైనిక దుస్తుల్లోనే జవాన్లతో భేటీ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోదీ కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయ ఘటన సహా సరిహద్దుల్లో పరిస్థితిని మోదీ సమీక్షించనున్నారు. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన జవాన్లును కూడా ప్రధాని పరామర్శించనున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లడఖ్‌లో రెండు నెలలుగా ఉద్రిక్తతల కొనసాగుతుండగా.. జూన్ 15న జరిగిన ఘర్షణతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వాస్తవానికి శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ వెళతారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, రాజ్‌నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్లి, సైనికుల్లో ధైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్న మీదటే, ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. భారత్ శాంతికాముక దేశమని, ఇదే సమయంలో ఎవరైనా ఆక్రమణకు దిగితే మాత్రం వెనుకంజ వేయద్దని మోదీ ఈ సందర్భంగా సరిహద్దు జవాన్లకు సూచించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం యథాతథస్థితి పునరుద్ధరణ విషయంలో చైనాకు ఎలాంటి అవకాశం ఇవ్వరాదనే నిర్ణయంతో భారత్ ఉంది. చుషుల్-మోల్డో సరిహద్దు సిబ్బంది సమావేశం (బీపీఎం) పాయింట్ వద్ద జరిగి చర్చల సందర్భంగా భారత్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది.








Untitled Document
Advertisements