కోహ్లీతో నన్ను అస్సలు పోల్చకండి: పాక్ క్రికెటర్

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 11:50 AM

కోహ్లీతో నన్ను అస్సలు పోల్చకండి: పాక్ క్రికెటర్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనని పోల్చొద్దని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సూచించాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాబర్ అజామ్.. మూడు ఫార్మాట్లలోనూ నిలకడలో విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు. దాంతో.. పాక్ అభిమానులు ముద్దుగా అతడ్ని ‘పాక్ కోహ్లీ’ అని పిలుస్తున్నారు. ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ, బాబర్ మధ్య పోలికని ఇష్టపడుతున్నారు.
విరాట్ కోహ్లీతో పోలికని ఇన్నాళ్లు ఇష్టపడిన బాబర్ అజామ్.. స్వయంగా ఎన్నోసార్లు కోహ్లీలా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు కూడా. కానీ.. ఇటీవల అతని చేతికి టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలురాగా.. ఇంగ్లాండ్ పర్యటన రూపంలో అతనికి సరికొత్త సవాల్ ఎదురుకాబోతోంది. ఈ నేపథ్యంలో.. పాక్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల్ని తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఆ పోలికకి స్వస్తి చెప్పాలని బాబర్ భావించినట్లున్నాడు. మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ టీమ్.. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉంది.

‘‘విరాట్ కోహ్లీతో నన్ను పోల్చకండి. మీరు పోలిక తేవాలనుకుంటే పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, యూనిష్ ఖాన్‌లతో పోల్చండి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నా సహజసిద్ధమైన ఆటని ఆడతాను. ఇక నా షాట్ సెలక్షన్.. పిచ్, బౌలర్లకి అనుగుణంగా మార్చుకుంటా’’ అని బాబర్ అజామ్ వెల్లడించాడు.

2008లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లలోనూ 50కిపైగా సగటుతో కొనసాగుతున్న కోహ్లీ.. 70 శతకాలు సాధించాడు. మరోవైపు బాబర్ అజామ్ 26 టెస్టులు, 74 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌లాడి.. 16 సెంచరీలు సాధించాడు.





Untitled Document
Advertisements