తెలంగాణలో కరోనా ర్యాపిడ్ టెస్టులకు గ్రీన్ సిగ్నల్

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 01:00 PM

తెలంగాణలో కరోనా ర్యాపిడ్ టెస్టులకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా కోవిడ్ పరీక్షలు చేయడం కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా ఆరు గంటల్లోగా ఫలితం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా టెస్టింగ్ కిట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నాయి. ముందుగా 50 వేల కిట్లను తెప్పించనున్నారు.
వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో.. పీహెచ్‌సీలు, ప్రభుత్వ హాస్పిటళ్లలో వీటిని ఉపయోగించి టెస్టులు చేస్తారు. వెంటనే కరోనా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. తర్వాత ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇస్తారు.

కరోనా నిర్ధారణ కోసం మన దేశంలో ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌ టెస్టులు చేస్తున్నారు. శాంపిళ్ల సేకరణ, రవాణాకు రెండు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా పరీక్షలను ఉచితంగా చేస్తుండగా.. ప్రయివేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లు రూ.2200 వసూలు చేయాలని సర్కారు ఆదేశించింది. ఈ టెస్టుల ద్వారా ఫలితం తేలడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో శాంపిళ్లు పేరుకుపోతుండటంతో.. తరచుగా శాంపిళ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తోంది.

ఆర్‌టీ పీసీఆర్ టెస్టుతో పోలిస్తే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు రిజల్ట్ వేగంగా రావడమే కాదు, ఖర్చు కూడా తక్కువ. రూ.500ల్లోపు ఖర్చుతో యాంటీజెన్ టెస్టు చేసే వీలుంది. యాంటీజెన్‌ టెస్టు కోసం సేకరించిన నమూనాలను గంటలోపే పరీక్షించాలి. ఈ టెస్టులు చేయడానికి సాధారణ లేబోరేటీలు సరిపోతాయి. దీంతో పీహెచ్‌సీల్లోనూ వీటిని చేసే వీలుంది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే మరోసారి కరోనా టెస్టు చేస్తారు.



జూన్‌ 29 నాటికి రాష్ట్రంలో 84,134 టెస్టులు చేయగా.. 40,837 టెస్టులను జూన్‌ 20-29 మధ్యకాలంలోనే చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణలో జూలై 2 నాటికి 98,153 టెస్టులు చేయగా.. 18570 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం 9226 యాక్టివ్ కేసులున్నాయి.





Untitled Document
Advertisements