నేలాఖరివరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 06:50 PM

నేలాఖరివరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వారం రోజుల కిందట కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై జులై 31 వరకు నిషేధం విధిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. అప్పటి వరకూ భారత్ నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండబోవని స్పష్టం చేసింది. అయితే, వందే భారత్ మిషన్ మాత్రం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే సాధారణ రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 25 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌరవిమానయాన శాఖ నిలిపివేసింది. అయితే.. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు కొనసాగించింది. మరోవైపు.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’ ద్వారా స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.






Untitled Document
Advertisements