పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కులే ఉన్నారు. వీరంతా యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పంజాబ్ ఫ్రావిన్స్లోని షేక్పురా రైల్వే క్రాసింగ్ వద్ద శుక్రవారం (జులై 3) మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిక్కు యాత్రికులు నంకానా సాహెబ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనలను సడలించిన పాక్ ప్రభుత్వం ప్రార్థనా మందిరాలను సందర్శించడానికి ప్రజలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్తార్పూర్లోని తమ పవిత్ర స్థలం నంకానా సాహెబ్ను దర్శించేందుకు సిక్కులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.