భారత్, శ్రీలంక మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్లారిటీ ఇచ్చింది. ఇటీవల శ్రీలంకకి చెందిన మాజీ క్రీడల మంత్రి మహిదానంద ‘ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయింది’ అని తీవ్ర స్థాయిలో అరోపణలు గుప్పించాడు. దాంతో.. ఆ ఫైనల్పై ఇన్వెస్టిగేషన్కి ఓ స్పెషల్ టీమ్ని శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తొలుత ఆరోపణలు చేసిన మహిదానంద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న టీమ్.. ఆ తర్వాత వరుసగా అప్పటి చీఫ్ సెలక్టర్ డిసిల్వా, ఓపెనర్ ఉపుల్ తరంగ, కెప్టెన్ కుమార సంగక్కరలను విచారించి వారి వాంగ్మూలాలని తీసుకుంది. కానీ.. ఫిక్సింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు తమకి లభ్యం కాలేదని స్పష్టం చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్.. శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టరీ సెక్రటరీకి రిపోర్ట్ సమర్పించింది. మరోవైపు ఈ ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ కూడా స్పందించింది.
‘‘2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్పై ఫిక్సింగ్ ఆరోపణల్ని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ ఆ ఫిక్సింగ్పై ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాబట్టి.. ఇక అనుమానం వ్యక్తం చేయడానికి కూడా అవకాశమే లేదు’’ అని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జీఎం అలెక్స్ వెల్లడించాడు.