కొత్తగూడెం పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 11:52 AM

కొత్తగూడెం పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రెండు జిల్లాల్లో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం పాల్వంచలో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కాగా, కొత్తగూడెం సమీపంలోని చాతకొండలో ఉన్న పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్‌లో బందోబస్తు విధులు నిర్వహించడానికి వెళ్లొచ్చారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తించిన వీరు ఇటీవలే కొత్తగూడెం తిరిగొచ్చారని తెలుస్తోంది. వీరందరికీ చాతకొండలోని బారక్‌లోనే చికిత్స అందించనున్నారు. ప్రగతి భవన్‌లో ఇటీవలే ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ సిబ్బందిలో మొత్తం 20 మంది కోవిడ్ బారిన పడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తెలంగాణ కోవిడ్19 డ్యాష్ బోర్డ్ ప్రకారం భద్రాద్రి జిల్లాలో 40 మంది కరోనా బారిన పడగా.. పది మంది కోలుకున్నారు. ఖమ్మంలో 98 మంది కోవిడ్ బారిన పడగా.. 47 మంది కోలుకున్నారు. ప్రభుత్వం వెల్లడించిన మీడియా బులెటిన్ ప్రకారం శుక్రవారం ఖమ్మంలో ఇద్దరు, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. ముదిగొండకు చెందిన పసికందుతోపాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.





Untitled Document
Advertisements