బంగారంతో పేస్ మాస్క్ తాయారుచేయించుకున్న బడా బాబు

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 01:14 PM

బంగారంతో పేస్ మాస్క్ తాయారుచేయించుకున్న బడా బాబు

ఈ కరోనా టైమ్‌లో పేదలు డబ్బులు లేక బాధపడుతుంటే. బడా బాబులు మాత్రం.. ఉన్న డబ్బును ఎలా వాడాలో చేయాలో తెలియక పనికిరాని ఖర్చులు చేస్తున్నారు. విపత్కర సమయంలో కూడా తమ ఖరీదైన అలవాట్లను మానుకోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా బంగారంతో మాస్కు చేయించుకుని ఆశ్చర్యపరిచాడు.

పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి మూతి ఇప్పుడు బంగారంతో మెరిసిపోతోంది. అదేనండి అతడి మూతికి పెట్టుకున్న మాస్క్! ఎప్పుడూ ఒంటి మీద బంగారాన్ని సింగారించుకుని తిరిగే శంకర్‌కు సాధారణ గుడ్డ మాస్కులు ధరించడం కష్టంగా అనిపించిందో ఏమో.. ఏకంగా బంగారంతోనే మాస్క్ చేయించుకున్నాడు. ఇందుకు రూ.2.89 లక్షలు ఖర్చు చేశాడు.

శంకర్ రోజూ 3 కిలోల బరువుండే బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలు ధరిస్తాడు. బయటకు వెళ్లేప్పుడు కూడా బంగారు మాస్కునే ధరిస్తున్నాడు. దీంతో జనాలు అతడి మాస్క్‌ను చూసి నోరెళ్లబెడతున్నారు. అదేంటీ.. లోహంతో మాస్క్ చేస్తే ఊపిరి ఆడదు కదా అనేగా మీ సందేహం. ఔను, నిజమే.. ఇందుకు అతడు ఆ బంగారు మాస్క్‌కు చిన్న చిన్న రంథ్రాలు చేసుకున్నాడు. అయితే, ఈ మాస్కు వైరస్‌ను కట్టడి చేస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. దీనిపై అతడికి కూడా సందేహాలు ఉన్నాయి. కానీ, బంగారానికి అలవాటైన ప్రాణం కదా.. రిస్క్ అని తెలిసి కూడా దాన్నే పెట్టుకుని తిరుగుతున్నాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. కరోనా వైరస్ బారిన పడకూడదంటే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాల్సిందే. క్లాత్ మాస్క్‌కు కనీసం రెండు మూడు పొరలు ఉండాలి. ఇవి కాకుండా N95, సర్జికల్ మాస్కులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు పింప్రి చిన్చ్వాడ్ ప్రాంతంలో 3,284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో శంకర్ పెట్టుకున్న మాస్క్ అతడిని ఎంతవరకు రక్షిస్తుందనేది డౌటే. మరో విశేషం ఏమిటంటే.. ఇతడి మాస్కును చూసి జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఆశ్చర్యపోయారు. ‘‘ఇతడికి తెలివి కంటే డబ్బే ఎక్కువగా ఉన్నట్లు ఉంది’’ అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements