తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డ మరో ఎమ్మెల్యే

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 02:16 PM

తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డ మరో ఎమ్మెల్యే

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ఐపీఎస్‌లను కూడా వైరస్ మహమ్మారి వదలడం లేదు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, హోం మంత్రి కోవిడ్ బారిన పడగా.. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితం ఆమె యశోదా హాస్పిటల్‌లో చేరారు. టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కూడా టెస్టులు చేయగా రిపోర్టులు రావాల్సి ఉంది.

కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ విప్ సునీత స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. కరోనా ప్రారంభ దశలోనే ఉందన్న ఆమె ట్రీట్మెంట్ కొనసాగుతోందన్నారు.తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ) కాగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా కోవిడ్ బారిన పడ్డారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కూడా కరోనా సోకింది. హోం మంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడగా.. కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా కోవిడ్ నుంచి కోలుకున్నారు.





Untitled Document
Advertisements