జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు: వైఎస్ షర్మిల

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 03:31 PM

జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు: వైఎస్ షర్మిల

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సోదరి.. వైఎస్ షర్మిల స్పందించారు. ఈనెల 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు, ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. దీనికి ఒక వీడియో కూడా ఆమె జత చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై8న సీఎం ప్రారంభించనున్నారు.



ఇప్పటికే పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. అధికారులు ఈఅంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలని సూచించారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని సీఎం అన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇళ్లపట్టాల లబ్దిదారుల తుది జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు.

అంతేకాదు ఇళ్ల స్థలాలు పంపిణీ తర్వాత నాలుగేళ్లలో వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు జగన్. తొలి విడతలో చేపట్టే 15 లక్షల గృహ నిర్మాణాల్లో విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ గృహాల్లో పడక గది, వంట గది, లివింగ్‌ రూం, వరండా, మరుగుదొడ్ల లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు జగన్. అంతేకాకుండా ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులంటే నాసికరం అనే చెడ్డపేరు పోవాలని.. ప్రభుత్వం నాణ్యతతో పని చేస్తుందనే పేరు రావాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూనే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు.






Untitled Document
Advertisements