విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్!

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 03:42 PM

విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్!

విదేశీ విద్యార్థులకు అమెరికా మరో షాక్‌ ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే.. విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సిందేనని ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) సోమవారం (జులై 6) ప్రకటన చేసింది. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై ట్రంప్ సర్కార్ నిషేధం విధించడంతో అమెరికాలో ఉన్న విదేశీయులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.



‘2020-21 విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీ చేయబోం. అలాంటి వారిని దేశంలోకి అనుమతింబోం. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నవారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది’ అని ఐసీఈ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థులు చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే.. ఆన్‌లైన్ కాకుండా, భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇస్తున్న విద్యా సంస్థలకు బదిలీ చేసుకోవాలని ఐసీఈ స్పష్టం చేసింది. లేదంటే ఇమ్మిగ్రేషన్‌ శాఖ తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే.. అలాంటి విద్యా సంస్థలకు కూడా నిబంధనలు విధించింది. రెండు మాధ్యమాల ద్వారా తరగతులు నిర్వహించడానికి సిద్ధమైన విద్యాసంస్థలు.. ఎక్కువ మంది విద్యార్థులు భౌతికంగా హాజరవుతున్నారని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో అమెరికాలో దాదాపు 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరి ద్వారా 2018 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 44.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లే వారిలో చైనా నుంచి అత్యధిక మంది ఉండగా.. రెండో స్థానంలో భారత్ ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి అమెరికాకు ఎక్కువ మంది వెళ్తున్నారు.



ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా తదితర దేశాల్లో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్ నిర్ణయంతో ఆ కొద్ది మంది కూడా సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు.. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష డెమొక్రాటిక్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. విద్యాసంస్థలు కచ్చితంగా తెరవాలని ఆదేశించడం ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయమేనని.. దీని వల్ల లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలోకి జారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.





Untitled Document
Advertisements