టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ 2020!?

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:10 PM

టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ 2020!?

టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించడాన్ని తాము సమర్థించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల స్పష్టం చేయగా.. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అదే వాదనని వినిపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొనగా.. టోర్నీని వాయిదా వేసే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అడుగులు వేస్తోంది. ఈ నెల మూడో వారంలో వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేయనుండగా.. ఒకవేళ ఆ టోర్నీ వాయిదాపడితే.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోంది.
టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్లాస్ చేస్తుండటంపై తన యూట్యూబ్ ఛానల్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ ‘‘టీ20 వరల్డ్‌కప్, ఐపీఎల్ 2020 సీజన్ మధ్య క్లాష్ వచ్చిందని అంతా చెప్తున్నారు. ఐసీసీని కంట్రోల్ చేయగల సామర్థ్యం, బలం బీసీసీఐ వద్ద ఉంది. ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాము కరోనా వైరస్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌కి ఆతిథ్యమివ్వలేం అని చెప్తే ఒప్పుకోవచ్చు. కానీ.. బీసీసీఐ ఒత్తిడి మేరకు ఐసీసీ ఆ వరల్డ్‌కప్‌ని వాయిదా వేస్తే మాత్రం.. మిగిలిన క్రికెట్ సభ్య దేశాల నుంచి ప్రశ్నలు మొదలవుతాయి. అక్టోబరు- నవంబరు విండోలో భారత క్రికెట్ బోర్డు 8 జట్లతో ఐపీఎల్‌ని నిర్వహించగలిగేటప్పుడు.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వరల్డ్‌కప్‌ని నిర్వహించలేదా..?’’ అని ఇంజిమామ్ ఉల్ హక్ ప్రశ్నించాడు.



వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని తొలుత ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ.. గడువులోపు దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. టోర్నీని నిరవధికంగా వాయిదా వేసేసింది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్‌ని నిర్వహించలేకపోతే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది. దాంతో.. బీసీసీఐని దెబ్బతీయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పావులు కదుపుతోంది.





Untitled Document
Advertisements