స్ఫాన్సర్స్ కోసం పీసీబీ ఎదురుచూపులు

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 06:34 PM

స్ఫాన్సర్స్ కోసం పీసీబీ ఎదురుచూపులు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్ఫాన్సర్స్ కోసం వెతుకుతోంది. గత నాలుగు నెలలుగా కరోనా వైరస్ అన్ని రంగాల్ని కుదిపేయగా.. ఇప్పుడు పాక్ జట్టుకి స్ఫాన్సర్‌గా ఉండేందుకు పెద్ద కంపెనీలు ఏవీ ముందుకు రావడం లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం ఇప్పటికే అక్కడికి వెళ్లిన పాకిస్థాన్ టీమ్.. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉంది. ఇక ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ని పాక్ ఆడనుండగా.. అప్పటిలోపు స్ఫాన్సర్స్‌ని పట్టుకునే పనిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ జట్టుకి ఇన్నిరోజులు స్ఫాన్సర్‌గా ఉన్న పెప్సీ ఒప్పందం ఇటీవల ముగిసింది. దాంతో.. మళ్లీ స్ఫాన్సర్ కోసం ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టెండర్స్‌ని ఆహ్వానించగా.. పెప్సీ మినహా ఎవరూ ముందుకు రాలేదు. ఇక బిడ్ వేసిన పెప్సీ కూడా మునుపటితో పోలిస్తే 35-40 శాతం ధరని తగ్గించింది. దాంతో.. పీసీబీ వెనక్కి తగ్గగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోపు కొత్త స్ఫాన్సర్ దొరక్కపోతే.. పాక్ ఆటగాళ్ల జెర్సీపై పీసీబీ లోగో మినహా మరేమీ ఉండకపోవచ్చు.

2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రదాడి జరగగా.. అప్పటి నుంచి గత ఏడాది వరకూ పాక్‌లో పర్యటించేందుకు ఏ క్రికెట్ జట్టు సాహసించలేదు. దాంతో.. యూఏఈని తటస్థ వేదికగా చేసుకుని పాక్ సిరీస్‌లను ఆడింది. ఈ కారణంగా రూ. వేల కోట్లు నష్టపోయిన పీసీబీ గత ఏడాది కాస్త కోలుకున్నట్లు కనిపించింది. కానీ.. కరోనా వైరస్‌తో మార్చి నుంచి సిరీస్‌లన్నీ రద్దవగా.. మళ్లీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పీసీబీ.. ఇప్పుడు స్ఫాన్సర్స్ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.





Untitled Document
Advertisements