టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా పాజిటివ్

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 01:02 PM

టీటీడీ సిబ్బందిలో 91 మందికి కరోనా పాజిటివ్

ఆదివారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. జూన్ 10 నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించిన తర్వాత.. రోజుకు సగటున 10వేల మంది దర్శించుకుంటున్నారని తెలిపారు. కళ్యాణకట్టలో ఇంతవరకూ ఎవరూ కరోనా వైరస్ బారినపడలేదని, దీనిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఇప్పటి వరకూ 82, 520 మంది తలనీలాలు సమర్పించారని, కళ్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో మీడియాకు వెల్లడించారు.



ఇప్పటి వరకూ 634 భక్తులకు కరోనా పరీక్షలను నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని తెలిపారు. అయితే, టీటీడీ సిబ్బందిలో మొత్తం 91 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందన్నారు. అలిపిరి వద్ద 1704 మంది, తిరుమలలో 1,865 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తున్నామని, అప్పటి పరిస్థితులను బట్టి ఉత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

జూన్ 11 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్‌‌లో టిక్కెట్లు బుక్‌చేసుకున్న భక్తుల్లో 1,64,742 మంది దర్శనం చేసుకున్నారని తెలిపారు. అయితే, టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిలో 30 శాతం మంది దర్శనానికి రాలేదని వెల్లడించారు. కరెంటు బుకింగ్ ద్వారా 85,434 మందితో సహా నెలలో మొత్తం 2,50,176 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో 55,669 మంది దర్శనానికి రాలేదు. అలాగే, 90,716 మంది కరెంటు బుకింగ్ ద్వారా టికెట్ల తీసుకున్నా.. వీరిలో 11 వేల మంది దర్శనంకు రాలేదని వివరించారు.

నెల రోజుల్లో శ్రీవారికి హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు సమకూరిందన్నారు. భక్తులు 100 గ్రాముల‌ బంగారు బిస్కెట్లు 20 సమర్పించారు. నెల రోజులుగా 13.36 లక్షల లడ్డూలు విక్రయించినట్టు తెలిపారు. తలనీలాల ధరలు పెరగడంతో అదనంగా రూ.7 కోట్ల ఆదాయం టీటీడీకి వచ్చిందన్నారు.





Untitled Document
Advertisements