కరోనా మృతదేహాల తరలింపుకు ఫ్రీ అంబులెన్స్‌...ఫోన్ నెంబర్ ఇదే

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:14 PM

కరోనా మృతదేహాల తరలింపుకు ఫ్రీ అంబులెన్స్‌...ఫోన్ నెంబర్ ఇదే

కరోనా అనే పేరు వింటేనే జనం భయపడిపోతున్నారు. ఇక ఎవరికైనా కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు భయంతో వణుకుతున్నారు. వారి దరి దాపుల్లో కూడా వెళ్లడం లేదు. ఇక కరోనా సోకిన వారిని చాలా జాగ్రత్తగా అంబులెన్స్‌లలో క్వారంటైన్ సెంటర్లకు తరిలస్తున్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే మాత్రం వారి మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదన్న విషయం తెలిసిందే. అధికారులు వారికి అంత్యక్రియలు చేస్తున్నారు. అయితే కొందరి కరోనా మృతుల తరలింపు, అంత్యక్రియల విషయంలో పలుచోట్ల అధికారుల నిర్లక్ష్యం బయటపడిన విషయం తెలిసిందే. జేసీబీలతో దారుణాతి దారుణంగా మృతదేహాల్ని తరలించి ఖననం చేసిన విషయం మనం చూశాం.
అయితే అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఉండే వారెవరికి రాకుండా కరోనా మృతదేహాల తరలింపు కోసం కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నడుం బిగించారు. కరోనా మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. దీని కోసం ముగ్గురు ఉద్యోగులను కూడా పెట్టారు. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాట్లాడుతూ.. మృదేహాల తరలింపుకోసం ప్రైవేట్ ఆస్పత్రులు 25 వేలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అయితే, డబ్బు ఉన్నవారు ఇస్తారు కానీ, లేని వారి పరిస్థితి ఏంటి అనే దానికి బదులుగా ఈ సర్వీస్ ప్రారంభించామని అన్నారు.
అయితే ఈ సర్వీసు విషయంలో తమకు కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారని వారు తెలిపారు. ఒకరు అంబులెన్స్ ఇచ్చారని.. మరికొంత మంది నగదు సాయం చేస్తున్నారని అన్నారు. ఎవరికైనా అంబులెన్స్ కావలసి వస్తే.. 8499843545 నెంబర్‌కు కాల్ చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తమ సేవలు అందుబాటులో ఉంటాయని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తెలిపారు. కరోనా వ్యాపించిన దగ్గర నుంచి మానవత్వం కూడా మంటగలుస్తున్న వేళ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చేసిన ఈ సరికొత్త ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు. కనీసం వీరి రూపంలో అయినా భగవంతుడు కరోనా బారిన పడి చనిపోయిన వారికి తగిన సాయం చేశాడని అంటున్నారు.





Untitled Document
Advertisements