మరింత పెరిగిన రెడ్ మీ నోట్ 8 ధర!

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:52 PM

మరింత పెరిగిన రెడ్ మీ నోట్ 8 ధర!

మనదేశంలో రెడ్ మీ నోట్ 8 ధర మళ్లీ పెరిగింది. ఈ ధర పెంపు ప్రత్యేకంగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ మీదనే ఉంది. జూన్ ప్రారంభంలోనే దీని ధర ప్రత్యేకంగా పెరగడం విశేషం. ఇప్పుడు ఈ ఫోన్ పెరిగిన ధరలకే అందుబాటులో ఉంది. రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ ఈ ఫోన్ గతేడాది అక్టోబర్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం పెరిగిన ధరతో రియల్ మీ నార్జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది.

ఇప్పుడు పెరిగిన కొత్త ధర ప్రకారం.. రెడ్ మీ నోట్ 8 ధర రూ.12,499కు చేరింది. ఇంతకు ముందు దీని ధర రూ.11,999గా ఉండేది. ఇప్పుడు దాని ధర రూ.500 పెంచారు. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.9,999గా ఉండేది. తర్వాత మెల్లగా అది రూ.2,500 పెరిగింది. అయితే 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు.

ఇందులో 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా.. 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది.

ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఎంఐయూఐ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఫోన్ పని చేస్తుంది. అంతేకాకుండా వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.





Untitled Document
Advertisements