బిజెపి ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గుడ్ల దాడి!

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 07:38 PM

బిజెపి ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గుడ్ల దాడి!

టీఆర్ఎస్‌లోని హిందూ వ్యతిరేక మూకలు తనపై దాడికి దిగినట్లుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. వరంగల్‌లో తాను ‘ఆత్మనిర్భర్ భారత్’పై విలేకరుల సమావేశానికి హాజరయ్యానని ఈ సందర్భంలో తనపై కొంత మంది దాడికి యత్నించారని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన జత చేశారు. ఒక ఎంపీపై ఇలా దాడికి పాల్పడడం సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి సిగ్గు చేటని విమర్శించారు. పట్టపగలు ఒక ప్రజా ప్రతినిధిపై అల్లరి మూకలు దాడికి యత్నించడం ఏంటని ప్రశ్నించారు.


ఆదివారం జరిగిన వరంగల్ పార్టీ శ్రేణుల సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హన్మకొండకు వచ్చారు. ఈ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ లక్ష్యంగా అర్వింద్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలే టీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి గురిచేశాయి. వినయ్ బాస్కర్, నరేందర్‌ను అర్వింద్ బిల్లా రంగాలతో పోల్చారు. వీరు భూకబ్జాలకు పాల్పడుతున్నాయని, ఒక్కొక్కరిపై చాలా కేసులు ఉంటాయని అన్నారు.


పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. ఎంపీ అర్వింద్ దమ్ముంటే రుజువు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా నిలువరించారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దూసుకురావడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఇక్కడ కూడా పోలీసులు కలగజేసుకొని వీరిని చెదరగొట్టారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు మరింతగా కొనసాగే అవకాశం ఉండడంతో పోలీసులు వినయ్ భాస్కర్, నరేందర్ ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.






Untitled Document
Advertisements