విరాటపర్వంలో సాయిది పల్లవి ఆ పాత్ర కాదంట

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 11:18 AM

విరాటపర్వంలో సాయిది పల్లవి ఆ పాత్ర కాదంట

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచీ ఆమె చేస్తోన్న పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 1990ల్లో జరిగిన నక్సలైన్ ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన నక్సలైట్, విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారని ఇప్పటికే రూమర్లు చక్కర్లు కొట్టాయి.

అయితే, ఈ రూమర్లపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ రూమర్లలో నిజం లేదని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో నక్సలైట్ ఉద్యమాలకు కేంద్ర బిందువు అయిన వరంగల్ జిల్లా నుంచి నేను వచ్చాను. నేను పుట్టి పెరిగిన వరంగల్‌లో సమాజంలో మార్పు కోసం ఎలాంటి భయం లేకుండా ఉద్యమాలను లేవదీసినవాళ్లను నేను చూశాను. అవన్నీ ఇప్పుడు ‘విరాటపర్వం’లో చూపిస్తున్నాను. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషించడం లేదు. కానీ, ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు ఎంతో కీలకం ఆ పాత్ర. అలాంటి రోల్‌ను సాయి పల్లవి అద్భుతంగా చేశారు. ఆమె నటన కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది’’ అని వేణు చెప్పుకొచ్చారు.
‘విరాటపర్వం’ సినిమాకు సంబంధించి ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వేణు చెప్పారు. అయితే, ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం 300 మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమని, ప్రస్తుతం పరిస్థితుల్లో అది సాధ్యపడదు కాబట్టి షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపామన్నారు. పరిస్థితులు చక్కబడిన తరవాత షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో జాతీయ పురస్కార గ్రహీత నటి ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.





Untitled Document
Advertisements