ఇండియన్ రైల్వేస్ తీపికబురు...ప్రయాణికులకు కొత్త సేవలు

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 11:30 AM

ఇండియన్ రైల్వేస్ తీపికబురు...ప్రయాణికులకు కొత్త సేవలు

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతుంది. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు, అలాగే ప్యాసింజర్ల భద్రత లక్ష్యంగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకటి, రెండు కాకుండా ఏకంగా 20 రకాల సేవలను అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది.

ట్రైన్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి బెల్ మోగించడం, రైలు బోగిలలో రిలయ్‌టైమ్ సీసీ టీవీ మానిటరింగ్, మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసి బ్లూటూత్ ప్రింటర్ల ద్వారా వాటి ప్రింట్ చేయడం వంటి వివిధ రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వేస్ ప్రయత్నిస్తోంది.

రైల్వేస్ 2018లోనే ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ప్రయోజనం కలిగేంచేలా ఉండే నిర్ణయాలు దీని ద్వారా తెలియజేయాలని తన ఉద్యోగులను కోరింది. అన్ని జోన్ల పరిధిలోనూ ఈ సర్వీసులు అందుబటులో ఉండేలా చూసింది. ఇలా వచ్చిన ఐడియాల్లో మంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించుకుంది. 2018 సెప్టెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు ఈ పోర్టల్‌కు 2645 ఎంట్రీస్ వచ్చాయి. వీటిల్లో 20 వాటిని ఎంపిక చేసుకొని ఇప్పుడు అమలు చేస్తున్నారు.

అన్ని జోన్లలో రైల్వే నెట్‌వర్క్‌లోనూ ఈ 20 ఐడియాలను అమలు చేస్తారు. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే అన్ని జోనల్ జనరల్ మేనేజర్స్, ప్రొడక్షన్ యూనిట్లకు ఈ అంశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఈ 20 ఐడియాల్లో చాలా వరకు ప్రయాణికుల భద్రతకు సంబంధించినవే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిసిటీ వినియోగం లేకుండా నేచురల్ వాటర్ కూలర్ల ఏర్పాటు చేయనున్నారు. ఒక్కక్క వాటర్ కూలర్ ధర రూ.1.25 లక్షలు. ఇవి పదేళ్ల వరకు పనిచేస్తాయి. ఇలా పలు రకాల సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి ఇండియన్ రైల్వేస్ రెడీ అవుతోంది.





Untitled Document
Advertisements