టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆల్టైమ్ బెస్ట్ ఫీల్డర్ అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కితాబిచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్లో భారత అగ్రశ్రేణి ఫీల్డర్ల గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. టాప్-6 ఫీల్డర్లని ఎంపిక చేశాడు. ఇందులో రవీంద్ర జడేజా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. లిస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ఆరుగురు ఇండియా బెస్ట్ ఫీల్డర్లు: 1. రవీంద్ర జడేజా, 2. సురేశ్ రైనా, 3. మహ్మద్ కైఫ్, 4. యువరాజ్ సింగ్, 5. కపిల్దేవ్ 6. విరాట్ కోహ్లీ
మైదానంలోని ఏ ప్రదేశం నుంచైనా బంతిని వికెట్లపైకి విసరగల సామర్థ్యం రవీంద్ర జడేజాకి ఉందని చెప్పుకొచ్చిన ఆకాశ్ చోప్రా.. అందుకే అతనికి అగ్రస్థానాన్ని కట్టబెట్టినట్లు వెల్లడించాడు. ఇక సురేశ్ రైనా స్లిప్లో మెరుగైన ఫీల్డర్గా గుర్తింపు పొందగా.. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ పాయింట్ రీజిన్లో తిరుగులేని ఫీల్డర్లుగా అప్పట్లో ప్రశంసలు అందుకున్నారు. ఐదో స్థానంలో కపిల్దేవ్ ఎంపికకి 1983 వరల్డ్కప్ ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తీరే కారణమని చెప్పుకొచ్చిన ఆకాశ్ చోప్రా.. విరాట్ కోహ్లీ ఇప్పుడిప్పుడే ఫీల్డింగ్లో ఎదుగుతున్నందున అతడ్ని ఆరోస్థానానికి పరిమితం చేసినట్లు వివరించాడు.