ఆన్‌లైన్ గేమ్ ఎఫెక్ట్...20 రోజుల్లో రూ.5.40 లక్షలు లూటీ

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 02:19 PM

ఆన్‌లైన్ గేమ్ ఎఫెక్ట్...20 రోజుల్లో రూ.5.40 లక్షలు లూటీ

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అజాగ్రత్తగా ఉంటే సైబర్ కేటుగాళ్లు మన బ్యాంక్ అకౌంట్లలో సొమ్మంతా కాజేస్తున్నారు. ఇలాగే తల్లి స్మార్ట్‌ఫోన్లో బాలుడు ఆన్‌లైన్ గేమ్ ఆడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. బాలుడు అవతలి వ్యక్తికి అన్ని వివరాలు చెప్పడంతో తల్లి బ్యాంక్ అకౌంట్లో ఏకంగా రూ.5.40లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వెలుగుచూసింది. అమలాపురంలోని గణపతి థియేటర్‌ వీధికి చెందిన ఓ బాలుగు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లి స్మార్ట్‌ఫోన్ ద్వారా రోజూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. అయితే క్లాస్ ముగిసిన తర్వాత సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే ఫ్రీ ఫైర్‌ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఆడాడు. అందులో వెపన్స్‌ కొనాలంటే ఫలానా లింక్‌ ఓపెన్‌ చేయమంటే అలాగే చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ వివరాలు తెలిపేలా నిర్వాహకులు సాఫ్ట్‌వేర్ రూపొందించడంతో వివరాలన్నీ వారికి చేరిపోయాయి. అతడు వెపన్స్ కొనుగోలు చేసే సమయంలో ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ చేసేవాడు. దీంతో సైబర్ నేరగాళ్లు 20 రోజుల్లో బాలుడి తల్లి అకౌంట్ నుంచి రూ.5.40లక్షల వరకు దోచేశారు. ఈ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి మొబైల్‌కు మెసేజ్‌లు వస్తున్నా ఆమె గమనించేది కాదు.

బాలుడి తల్లి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.10వేల నగదు డ్రా చేసింది. దీంతో అకౌంట్లో రూ.1000 బ్యాలెన్స్ ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఆమె బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా రెండు అకౌంట్లలో నుంచి రూ.5.40లక్షలు డ్రా చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమె కొడుకును ఆరా తీయగా 20 రోజులు మొబైల్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పడంతో అవాక్కైంది. వెంటనే అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె కుమారుడు ఓటీపీ వాళ్లకు చెప్పడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్‌లు రావడంతో ఈ కేసు సైబర్‌ నేరం కింద వస్తుందా? రాదా? అని పోలీసులు నిపుణులు సంప్రదిస్తున్నారు. బాధితురాలి భర్త కువైట్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి డబ్బులు పంపిస్తున్నాడు. వాటిని ఆమె తన అకౌంట్లో భద్రంగా దాస్తూ ఆచితూచి ఖర్చు చేస్తోంది. ఇప్పుడు కొడుకు చేసిన పనితో భర్త కష్టమంతా ఆవిరైపోయిందని ఆవేదన చెందుతోంది.





Untitled Document
Advertisements