హైదరాబాద్, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ ఫలాలను వినియోగదారులకు చేరేలా చర్యలు చేపట్టింది. గౌహతిలో ఈ నెల 10న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి 213 వస్తువులపై పన్నులను తగ్గించింది. సవరించిన జీఎస్టీ శ్లాబులకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలను ఆయా కంపెనీలు తగ్గిస్తున్నాయి. నెస్లే, డాబర్, ఐటీసీ, అమూల్ కంపెనీలు కొత్త ధరలకు అనుగుణంగా తమ వస్తువులను విక్రయిస్తామని చెప్పాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఛైర్పర్సన్ వనజా సర్నా వెల్లడించారు.
గరిష్ఠ శ్రేణి అయిన 28 శాతం శ్లాబు నుంచి 178 వస్తువులను తప్పించి 18 శాతం లోపునకు చేర్చిన సంగతి తెలిసిందే. కేవలం 50 వస్తువులను మాత్రమే 28శాతం పన్ను శ్లాబులో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా సంస్థలు కూడా వివిధ వస్తువుల ధరలను తగ్గిస్తున్నాయి.