'గుంజ‌న్ స‌క్సేనా' ట్రైల‌ర్...ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:49 PM

'గుంజ‌న్ స‌క్సేనా' ట్రైల‌ర్...ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే భారత దేశపు తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజ‌న్ స‌క్సేనా జీవిత కథ ఆధారంగా 'గుంజ‌న్ స‌క్సేనా' పేరుతో ఓ మూవీ రూపొందిస్తున్నారు. శరణ్‌శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌ విడుదలై సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసి ఆ అంచనాలను రెట్టింపు చేశారు మేకర్స్.

2 నిమిషాల 41 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌లో గుంజ‌న్ స‌క్సేనా జీవితంలోని ముఖ్య ఘటనలను చూపించారు. పైలట్స్ అంటే కేవ‌లం పురుషులు మాత్ర‌మే కాగ‌ల‌రు అని భావిస్తున్న ఆ రోజుల్లో గుంజ‌న్ స‌క్సేనా ఎందుకు పైలట్ కావాల‌నుకుంది? ఈ క్రమంలో ఆమె పడిన కష్టాలేంటి? లాంటి సన్నివేశాలు చూపిస్తూనే.. కార్గిల్‌ యుద్ధ సమయంలో చీతా హెలికాప్టర్‌లో గుంజన్ సైనికులతో పాటు ఆహారం, ఔషధాలను తరలించడం, కీలక సమయాల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తించడం వంటి స‌న్నివేశాలతో ట్రైలర్‌ని ఆసక్తికరంగా మలిచారు. దీంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతూ వైరల్ అవుతోంది.

కార్గిల్ యుద్ధ సమయంలో గుంజ‌న్ స‌క్సేనా అందించిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ఆమెకు శౌర్య చ‌క్ర అవార్డు ప్రధానం చేసి స‌త్క‌రించింది. కాగా స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్ట్ 12వ తేదీన ‘గుంజన్ సక్సేనా’మూవీ విడుదల కానున్నట్లు తెలిపారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌తో పాటు అంగద్‌ బేడీ, మానవ్‌ విజ్‌, పంకజ్‌ త్రిపాఠి, రజత్‌ బర్మేచా, నీనా గుప్తా, విజయ్‌ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.






Untitled Document
Advertisements