జంతువుల్లో తొలి కరోనా కేసు...కుక్క మృతి

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 06:02 PM

జంతువుల్లో తొలి కరోనా కేసు...కుక్క మృతి

కరోనా వైరస్‌ జంతువులకు కూడా సోకుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో పులులు, సింహాలు, పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా వైరస్ సోకిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ, తొలిసారిగా అమెరికాలోని న్యూయార్క్‌లో కరోనా బారినపడి పెంపుడు శునకం మృత్యువాతపడింది. ప్రపంచంలో తొలి కేసు ఇదేనని భావిస్తున్నారు.

న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి జర్మన్‌ షెపర్డ్‌ సంతతికి చెందిన శునకాన్ని పెంచుకుంటున్నారు. దాని పేరు ‘బడ్డీ’. ఆ వ్యక్తికి రెండు నెలల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బడ్డీకి శ్వాసకోస సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మే నెలలో పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్లు వెటర్నరీ డాక్టర్లు చెప్పారు. కొన్ని వారాలకు బడ్డీ ఆరోగ్యం మరింత క్షీణించింది. జులై 11న ఆ శునకం మరణించింది. ఈ విషయాలను శునకం యజమాని రాబర్ట్ మహని ‘నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బడ్డీ చనిపోయే ముందు దానికి కేన్సర్‌ సంబంధ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే.. అది వైరస్‌ కారణంగా కేన్సర్‌ వృద్ధి చెంది మరణించిందా? లేదా నేరుగా కరోనా వైరస్‌ ప్రభావం వల్లే మరణించిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. న్యూయార్క్‌ ఆరోగ్య శాఖ అధికారులు యజమాని ఇంటికి వెళ్లేసరికే.. అతడు ఆ శునకానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇది దర్యాప్తుకు ఓ అవరోధంగా మారింది.

అమెరికాలో ఇప్పటికే పదుల సంఖ్యలో పెంపుడు శునకాలు, పిల్లులు కరోనా వైరస్‌ బారినపడ్డాయి. న్యూయార్క్ జూలో పులులు, సింహాలకూ వైరస్‌ సోకింది. వీటికి వైరస్‌ ఎలా సోకిందనే విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే.. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నా.. జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంతవరకు అలాంటి ఆధారాలు లేవని వివరిస్తున్నారు.





Untitled Document
Advertisements