బలూచిస్థాన్లో ఉద్రిక్తంగా మారిన‌ స్వాతంత్య్ర పోరాటం.. ఏడుగురు పాక్ జవాన్ల హత్య

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 06:05 PM

బలూచిస్థాన్లో ఉద్రిక్తంగా మారిన‌ స్వాతంత్య్ర పోరాటం.. ఏడుగురు పాక్ జవాన్ల హత్య

బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ దాడుల్లో ఏడుగురు పాకిస్థానీ జవాన్లు మరణించారు. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. పాక్ ఆర్మీ తమ గొరిల్లా ఫైటర్లపై ఆకస్మికంగా దాడి చేసినందుకే ప్రతి చర్యగా జవాన్లను హతమార్చినట్లు విప్లవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో సైనికులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ తెలిపింది.

బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ ప్రతినిధి గ్వహ్రమ్‌ బలోచ్‌ పేరుతో శుక్రవారం (జులై 31) రాత్రి ఓ ప్రకటన విడుదలైంది. ‘గత రాత్రి తమ సభ్యులు (బలోచ్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నవారు) మాష్కేలోని మంగూలి చెక్‌పోస్టుపై స్నైపర్లు, ఆయుధాలతో దాడిచేసి ముగ్గురు జవాన్లను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది.

దరజ్‌‌కౌర్‌ నదీ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లను హతమార్చినట్లు బలూచ్ ఫ్రంట్ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బలోచ్‌ గొరిల్లా ఫైటర్లపై పాకిస్థాన్‌ ఆర్మీ బృందం ఆకస్మిక దాడికి పాల్పడిందని.. దీన్ని దీటుగా ఎదుర్కొన్నామని ఫ్రంట్‌‌ పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు పాక్‌ జవాన్లను మట్టుబెట్టినట్లు తెలిపింది. మరో ఇద్దరిని గాయపరిచినట్లు పేర్కొంది. పాక్‌ ఆక్రమిత బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు.. బలూచిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించారు. బలూచిస్థాన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బలూచిస్థాన్‌లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఆందోళనకారులను అణచివేసే క్రమంలో ఆర్మీ చేసిన దాడుల్లో నలుగురు పౌరులు మరణించారు. దీంతో బలూచిస్థాన్‌లో వేర్పాటువాదుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.





Untitled Document
Advertisements