150 రోజులు ఫ్యామిలీకి దూరం అవనున్న టీంఇండియా

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 07:07 PM

150 రోజులు ఫ్యామిలీకి దూరం అవనున్న టీంఇండియా

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు.. ఇక దాదాపు 150 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆగస్టు మూడో వారంలో ఇక్కడి నుంచి బయల్దేరనున్న క్రికెటర్లు.. ఆ తర్వాత అక్కడి నుంచే ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్నారు. అక్కడ కంగారూలతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడి అనంతరం జనవరి మూడో వారం తర్వాతే భారత్ గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా.. ఐదు నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీకి నెల రోజుల ముందే అంటే ఆగస్టు 20 నాటికి యూఏఈకి భారత క్రికెటర్లు చేరుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. యూఏఈకి విమానం ఎక్కే ముందే భారత క్రికెటర్లకి అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఒక క్యాంప్‌ని నిర్వహించి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తోంది. అదే జరిగితే.. వారం రోజులు ముందే ఫ్యామిలీని వీడి.. భారత క్రికెటర్లు అహ్మదాబాద్‌కి చేరుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ 2020 సీజన్‌ని 51 రోజుల విండోలో మొత్తం 60 మ్యాచ్‌లతో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. పూర్తి స్థాయిలో షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనున్న టీమిండియా.. జనవరి 12 నుంచి 17 వరకూ మూడు వన్డేల సిరీస్‌లో ఢీకొడుతుంది. ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనకి మధ్య గడువు చాలా తక్కువగా ఉండటం.. మధ్యలో 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి కావడంతో భారత క్రికెటర్లు ఇంటికి వచ్చే అవకాశం లేకపోయింది. మరోవైపు ఐపీఎల్‌ 2020 సీజన్‌ని పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహించబోతుండటంతో.. టోర్నీ సమయంలో క్రికెటర్లతో ఫ్యామిలీ ఉండే అవకాశం లేదు.





Untitled Document
Advertisements