అతడ్ని ఓడించలేకపోతే ధోనీకి రిటైర్మెంట్ తప్పదు!!!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:17 AM

అతడ్ని ఓడించలేకపోతే ధోనీకి రిటైర్మెంట్ తప్పదు!!!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌‌లో ఆఖరిగా భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత గత ఏడాది కాలంగా కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దాంతో.. అతని కెరీర్ ఇప్పటికే ముగిసిపోయిందని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలోకి ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని మరికొందరు జోస్యం చెప్తున్నారు. మొత్తంగా.. ధోనీ రిటైర్మెంట్ గురించి గత ఏడాదికాలంగా భారత క్రికెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ.. అతను మాత్రం పెదవి విప్పడం లేదు.

ధోనీ తన రిటైర్మెంట్ గురించి మూడేళ్ల క్రితమే భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో ఓ మాట చెప్పినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహ విందుకి హాజరైన సమయంలో.. ధోనీ తనతో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు మంజ్రేకర్ వెల్లడించాడు. 2017 చివర్లో కోహ్లీ పెళ్లి జరగగా.. అప్పటికే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
‘‘విరాట్ కోహ్లీ మ్యారేజ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీతో కాసేపు పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది. ఆ సమయంలో రిటైర్మెంట్ గురించి మా మధ్య జరగగా.. ధోనీ ఒక్కటే మాట చెప్పాడు. టీమిండియాలో అత్యంత వేగంగా పరుగెత్తే క్రికెటర్‌ని రేసులో ఓడించినంత కాలం.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడతాను. నా ఫిట్‌నెస్‌కి అదే ప్రమాణం’’ అని ధోనీ చెప్పాడని మంజ్రేకర్ వెల్లడించాడు.

టీమిండియాలో వేగంగా పరుగెత్తే ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా టాప్-3లో కొనసాగుతున్నారు. 2017, డిసెంబరులో హార్దిక్ పాండ్యాని 100 మీటర్ల రేసులో ఓడించిన ధోనీ.. త్వరలోనే తన ఫిట్‌నెస్‌ని మరో రేస్‌తో నిరూపించుకుంటాడేమో చూడాలి. మరి అతనికి పోటీగా రేసులోకి దిగే క్రికెటర్‌ ఎవరో..? త్వరలోనే తేలిపోనుంది. బహుశా ఈసారి రవీంద్ర జడేజాతో ధోనీ పోటీపడొచ్చు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements