పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్: ఇంగ్లాండ్‌కి ఊహించని ఎదురుదెబ్బ

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:26 AM

పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్: ఇంగ్లాండ్‌కి ఊహించని ఎదురుదెబ్బ

పాకిస్థాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఫ్యామిలీ రీజన్స్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మాంచెస్టర్ వేదికగా ఇటీవల పాకిస్థాన్‌తో ముగిసిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ టీమ్.. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ సౌథాంప్టన్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌‌తో పాటు ఆఖరి టెస్టుకి కూడా తాను దూరంగా ఉండనున్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు.

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న బెన్‌స్టోక్స్.. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సమయంలో ఒంటిచేత్తో జట్టుకి విజయాల్ని అందించాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టులో అతను బ్యాట్‌తో విఫలమైనా.. బంతితో రాణించి 2/11 స్పెల్‌తో పాకిస్థాన్‌ని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా నిలకడగా రాణిస్తున్న బెన్‌స్టోక్స్ జట్టులో లేకపోవడం ఇంగ్లాండ్‌ని ఒత్తిడిలోకి నెట్టే అంశమే.

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించిన బెన్‌స్టోక్స్.. ఇప్పుడు అక్కడే అనారోగ్యం బారిన పడిన తన తండ్రిని చూసేందుకు.. ఇంగ్లాండ్ నుంచి వెళ్తున్నాడు. ఇటీవల బెన్‌స్టోక్స్ తండ్రి‌ తీవ్ర అస్వస్థతకి గురవడంతో.. అతడ్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. దాంతో.. ఈ నెల చివరి వారం వరకూ క్రైస్ట్‌చర్చ్‌లోనే బెన్‌స్టోక్స్ ఉండనున్నట్లు సమాచారం. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 28 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. బెన్‌స్టోక్స్ ఈ సిరీస్‌లో ఆడటంపై ఇంకా స్పష్టం రావడం లేదు.





Untitled Document
Advertisements