మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు ఈ ఉదయం కన్నుమూశారు. కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఎనిమిది పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన, రెండుసార్లు మంత్రిగానూ పనిచేశారు. 1958లో సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన, 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అందులోనే కొనసాగారు.